శ్రీవారి పంచ చిరిగిన వేళ: తరిగొండ వెంగమాంబ దివ్య భక్తి గాథ!
సనాతన ధర్మంలో భగవంతుడికి, భక్తునికి మధ్య ఉన్న అనుబంధం ఎంతో మధురమైనది. భక్తుని ప్రేమకు దాసుడై, లీలలు చూపే శ్రీనివాసుని చరిత్రలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్థానం అత్యున్నతమైనది. తిరుమల ఆనంద నిలయానికి సమీపంలో నివసించిన ఈ మహా భక్తురాలితో వెంకటేశ్వర స్వామికి ఉన్న చనువు, సాన్నిహిత్యం ఎంతో దివ్యమైనవి.
రాత్రిపూట వెంగమాంబ ఇంటికి స్వామివారి రాక
తిరుమల క్షేత్రంలో ప్రతిరోజూ రాత్రి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత, శ్రీ వేంకటేశ్వర స్వామివారు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వేంచేసేవారని ప్రతీతి. అక్కడ వెంగమాంబ గారు స్వామివారిని ఊయలలో కూర్చోబెట్టి, మైమరచిపోతూ ఉయ్యాల ఊపుతూ భాగవతాన్ని చదివి వినిపించేవారు.
సాక్షాత్తు భగవంతుని లీలలతో కూడిన భాగవత కథను, ఆ భగవంతుడే చిన్నపిల్లవాడిలా ఉయ్యాలలో ఊగుతూ ప్రశాంతంగా వినేవారు. భక్తురాలి అమాయకత్వంతో కూడిన భక్తికి స్వామివారు అంతగా పరవశించిపోయేవారు.
తెల్లవారిపోయిన వేళ... సుప్రభాత సేవ!
ఒకరోజు రాత్రి వెంగమాంబ గారు భాగవత పారాయణం చేస్తుండగా, స్వామివారు మైమరిచి వింటున్నారు. కాలం డింభకుడై సాగిపోయింది. రాత్రి గడిచి తెల్లవారొచ్చింది. సమయం ఉదయం 3:00.. 4:00 గంటలు దాటిపోతోంది.
అంతలోనే తిరుమల ఆనంద నిలయం నుంచి "కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే..." అంటూ సుప్రభాత శ్లోకాలు వినిపించాయి.
అది విన్న స్వామివారు ఒక్కసారిగా ఉలిక్కిపడి... "అయ్యో! సుప్రభాతం ప్రారంభమైంది, అర్చకులు తలుపులు తీసే సమయమైంది, నేను అక్కడ ఉండకపోతే అందరూ కంగారుపడతారు!" అని అనుకుంటూ చటుక్కున ఉయ్యాలలోంచి దూకి ఆనంద నిలయం వైపు పరిగెత్తబోయారు.
చిరిగిపోయిన శ్రీవారి పంచె ముక్క!
కథ పూర్తికాకుండా మధ్యలోనే పారిపోతున్న స్వామివారిని చూసి వెంగమాంబ గారు... "ఎక్కడికి వెళ్తావు ఘట్టం పూర్తి కాకుండా!" అంటూ చొరవగా స్వామివారి పంచె కొంగును గట్టిగా పట్టుకున్నారు.
స్వామివారు వేగంగా వెళ్లడంతో ఆ పట్టు పంచె "పర్ర..." అని చిరిగిపోయింది! పంచెలో కొంత ముక్క వెంగమాంబ గారి చేతిలోనే ఉండిపోగా, స్వామివారు మిగిలిన వస్త్రంతోనే వేగంగా వెళ్లి ఆనంద నిలయంలోని పద్మపీఠంపై నిలబడిపోయారు. వెంగమాంబ గారు ఆ చిరిగిపోయిన పంచె ముక్కను భక్తితో మడతపెట్టి తన పూజా గదిలో దాచుకున్నారు.
ఆనంద నిలయంలో అర్చకుల ఆశ్చర్యం
అర్చకులు శుచియై వచ్చి సుప్రభాతం పఠిస్తూ గర్భగుడి తలుపులు తెరిచారు. స్వామివారిని చూడగానే వాళ్లు తెల్లబోయారు! స్వామివారి వస్త్రం (పట్టు పంచె) చిరిగిపోయి, ఒకవైపు ముక్క లేకపోవడం గమనించారు. రాత్రివేళ దొంగలెవరూ లోపలికి రాలేదే, స్వామివారి వస్త్రం ఎలా చిరిగిపోయిందబ్బా అని ఆశ్చర్యపోయారు.
అప్పుడు అర్చకులకు ఒక్కసారిగా తరిగొండ వెంగమాంబ గుర్తుకువచ్చింది. స్వామివారితో అంత చనువు, స్వాతంత్ర్యం ఒక్క వెంగమాంబకు తప్ప ఇంకెవరికి ఉంటాయి?
వెంటనే అర్చకులు వెంగమాంబ గారి ఇంటికి వెళ్లారు. "అమ్మా! స్వామివారు చిరిగిపోయిన వస్త్రంతో నిలబడి ఉన్నారు, ఆ మిగిలిన ముక్క మీ వద్ద ఉందా?" అని అడిగారు.
దానికి వెంగమాంబ గారు ప్రశాంతంగా నవ్వుతూ... "తెల్లవారే వరకు స్వామివారు భాగవతం విన్నారు. సుప్రభాతం కాగానే హడావుడిగా పారిపోతుంటే పట్టుకున్నాను. పంచె చిరిగి ఆ ముక్క నా చేతికి వచ్చింది, దాన్ని లోపల పూజా గదిలో పెట్టాను, తీసుకెళ్లండి" అని చెప్పారు.
భగవంతుడు అధికారానికి, ఆడంబరాలకు లొంగడు; కేవలం నిష్కల్మషమైన ప్రేమానురాగాలకు మాత్రమే బంధీ అవుతాడని చెప్పడానికి ఈ ఘట్టమే ప్రత్యక్ష నిదర్శనం. తరిగొండ వెంగమాంబ గారి భక్తి పారవశ్యం సనాతన ధర్మంలో ఎప్పటికీ చిరస్మరణీయం!

No comments:
Post a Comment